హనుమంత వాహనంపై శ్రీ కోదండ రాముడి అభయం
తిరుపతి జూన్ 24,
అప్పలాయగుంటలోని శ్రీప్రసన్న వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో ఆరో రోజైన గురువారం ఉదయం శ్రీనివాసుడు శ్రీ కోదండ రాముడై హనుమంత వాహనంపై దర్శనమిచ్చారు. కోవిడ్ - 19 వ్యాప్తి నేపథ్యంలో ఆలయంలో ఏకాంతంగా వాహన సేవలు నిర్వహించారు. స్వామివారు త్రేతాయుగంలో శ్రీరాముడై అవతరించారు. హనుమంతుని భుజస్కంధాలపై అధిరోహించిన శ్రీ కోదండ రాముడిని దర్శించడం వల్ల భోగ భాగ్యాలు, జ్ఞానవిజ్ఞానాలు, ఆయురారోగ్యాలు కలుగుతాయి. మధ్యాహ్నం 3 నుండి సాయంత్రం 4 గంటల వరకు ఆలయంలో వసంతోత్సవం జరుగనుంది.
సాయంత్రం 6.30 నుండి 7 గంటల వరకు గజవాహనంపై స్వామివారు దర్శనమివ్వనున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో కస్తూరి బాయి, ఏఈవో ప్రభాకర్ రెడ్డి, ఆలయ ప్రధాన అర్చకులు మరియు కంకణబట్టార్ సూర్యకుమార్ ఆచార్యులు, సూపరింటెండెంట్ గోపాల కృష్ణారెడ్డి, టెంపుల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాసులు పాల్గొన్నారు.
శ్రీ చంద్ర మౌళీశ్వరస్వామివారికి పట్టు వస్త్రాల బహూకరణ
శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని ఉదయం 10 గంటలకు ఆలయ డెప్యూటీ ఈవో కస్తూరి బాయి అప్పలాయగుంటలోని శ్రీ చంద్ర మౌళీశ్వరస్వామివారికి పట్టు వస్త్రాలు బహూకరించారు.