'షర్మిల'కు ప్రధాని మోడీ ఫోన్.. వెంటనే ఢిల్లీ కి రావాలంటూ పిలుపు
వైఎస్ఆర్ తెలంగాణ రాష్ట్ర పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఫోన్ చేశారు. ఆమెతో ఏకంగా పదిహేను నిమిషాల పాటు మాట్లాడారు. ఇటీవల హైదరాబాద్ లో ఆమె అరెస్ట్ వ్యవహారంపై అరా తీశారు. షర్మిలకు జరిగిన ఘటనపై ప్రధాని సానుభూతి తెలిపారు. తక్షణం ఢిల్లీకి రావాలని ఆమెకు సూచించారు.
కాగా, తెలంగాణ రాష్ట్రంలో వైఎస్ షర్మిల పాదయాత్ర చేస్తున్నారు. ఈ పాదయాత్ర నేపథ్యంలో ఆమెపై తెరాస శ్రేణులు దాడి చేశాయి. ఆ తర్వాత ఈ ఘటనకు నిరసనగా ఆమె ధ్వంసమైన తన కారులోనే సీఎం కేసీఆర్ అధికారిక నివాసమైన ప్రగతి భవన్ ముట్టడికి వెళుతుండగా ఆమె కారు సీట్లో ఉండగానే వాహనాన్ని అక్కడి నుంచి పోలీసులు తీసుకెళ్లిపోయిన విషయం తెల్సిందే. షర్మిల కారులోనే కూర్చొనివుండగా, పోలీసులు ఆమె కారును కారుతో సహా క్రేన్ సాయంతో లిఫ్ట్ చేసి తీసుకెళ్లి పోయారు. .పాదయాత్రలో పాల్గొన్న ప్రచారరథానికి నిప్పు పెట్టడంతో పాటు పలు వాహనాలను ధ్వంసం చేశారు. ఈ ఘటన దేశ వ్యాప్తంగా సంచలనమైంది. కాగా, తనకు అండగా నిలిచి, తనను పరామర్శించిన ప్రధానికి షర్మిల ధన్యవాదాలు తెలిపారు. ప్రధాని కోరిక వినతి మేరకు త్వరలోనే ఢిల్లీకి వచ్చి కలుస్తానని చెప్పారు.
ఈనేపథ్యంలో షర్మిలకు ప్రధాని మోడీ స్వయంగా ఫోన్ చేయడం ఇపుడు తెలుగు రాష్ట్రాల్లో సంచనలనంగానూ, చర్చనీయాంశంగాను మారింది.