వరి నాట్లు వేసి ఆదర్శంగా నిలిచిన 'కలెక్టర్' దంపతులు..
ఐసిఎఫ్(చెన్నై) : పొలంలో వరినాట్లు వేసి రైతులకు, వ్యవసాయ కార్మికులకు ఆదర్శంగా నిలిచారు ఓ కలెక్టర్ దంపతులు. తిరుపత్తూర్ జిల్లాలో కొద్దిరోజులుగా వర్షాలు కురుస్తుండడంతో చెరువులు, కుంటలు జలకళను సంతరించుకున్నాయి. దీంతో, రైతులు సాగుపనులను ముమ్మరం చేశారు. మూక్కనూరు గ్రామంలో సాగుపనులను పరిశీలించిన కలెక్టర్ అమర్కుష్వాహ్, ఆయన సతీమణి శివాలికలు పొలంలోదిగి వ్యవసాయ కార్మికులతో కలసి నాట్లు వేశారు. వ్యవసాయం అంటే తనకు ఇష్టమని, తానూ వ్యవసాయ కుటుంబం నుండి వచ్చానని అన్నారు. జిల్లాలో వ్యవసాయం అభివృద్ధికి కృషి చేస్తానన్నారు. సుమారు గంటసేపు వరి నారును నాటిన కలెక్టర్ దంపతులను స్థానికులు ఆశ్చర్యంగా చూశారు.