వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను : రోజా..
ఏపీలో అప్పుడే ఎన్నికల వేడి కనిపిస్తోంది. ముందస్తు ఎన్నికలపై ఊహాగానాలు జోరందుకున్నాయి. ముఖ్యంగా ప్రధాన ప్రతిపక్షం టీడీపీ.. ముందస్తు ఎన్నికల గురించి హాట్ కామెంట్స్ చేస్తోంది. మొన్న అచ్చెన్నాయుడు, నేడు చంద్రబాబు.. ముందస్తు ఎన్నికల గురించి చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. ఎన్నికల విషయంలో టీడీపీ, వైసీపీ నేతలు.. ఢీ అంటే ఢీ అంటూ మాటల తూటాలు పేల్చుకుంటున్నారు. ఇటీవల టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు మాట్లాడుతూ.. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా.. తెలుగుదేశం పార్టీకి 160 సీట్లు వస్తాయంటూ జోస్యం చెప్పారు. తాజాగా చంద్రబాబు సైతం అలాంటి కామెంట్స్ చేశారు. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు కీలక కామెంట్స్ చేశారు. త్వరలోనే ముఖ్యమంత్రి ఎన్నికలకు వెళ్లాలని అనుకుంటున్నారని అన్నారు. మరికొంత కాలం ఆగితే ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వస్తుందని జగన్ భావించి ఎన్నికలకు వెళ్లాలని సిద్ధమవుతన్నారని చంద్రబాబు చెప్పారు. అయితే, ఎన్నికలు ఎప్పుడు వచ్చినా వైసీపీ ఓటమి ఖాయం అని జోస్యం చెప్పారు చంద్రబాబు. ఏపీలో ముందస్తు ఎన్నికలు రాబోతున్నాయన్న చంద్రబాబు.. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా టీడీపీ సిద్ధంగా ఉందని చెప్పారు.
ముందస్తు ఎన్నికలు, ఫలితాల గురించి టీడీపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలకు అధికార పార్టీ నేతలు గట్టిగానే కౌంటర్లు ఇస్తున్నారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా.. తెలుగుదేశం పార్టీకి 160 సీట్లు వస్తాయంటూ అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యలపై వైసీపీ ఫైర్ బ్రాండ్, చిత్తూరు జిల్లా నగరి ఎమ్మెల్యే రోజా ఘాటుగా బదులిచ్చారు. చంద్రబాబు, లోకేష్ తలకిందులుగా తపస్సు చేసినా 160 సీట్లు కాదు కదా.. ఇప్పుడున్న 23 సీట్లు రావడం కూడా కష్టమే అని రోజా అన్నారు. దమ్ముంటే టీడీపీ వాళ్లనే 23 సీట్లకు రాజీనామా చేసి మళ్లీ గెలవమనండి. వారంతా గెలిస్తే తాను ఇక ఎన్నికలలో పోటీ చేయబోనని రోజా సవాల్ విసిరారు.ఇలా అచ్చెన్న, రోజాల మధ్య పవర్ ఫుల్ పంచ్ డైలాగులు వినిపించాయి. ఇరు పక్షాల మధ్య సవాళ్లు, ప్రతి సవాళ్లతో రాజకీయాలను మరింత వేడెక్కించారు.