పాట పాడుతూ.. ప్రయాణికులను పిలుస్తున్న ఆర్టీసీ బస్ డ్రైవర్
గతంలో ఎన్నడూ లేని విధంగా టీఎస్ ఆర్టీసీ వార్తల్లో నిలుస్తుంది. టీఎస్ ఆర్టీసీ ఎండీగా బాధ్యతలు తీసుకున్న సజ్జనార్..తన ఆలోచనలతో ఆర్టీసీ ఆదాయం పెంచేందుకు కష్టపడుతున్నారు. కేవలం ఆయన మాత్రమే కాదు ఆర్టీసీ కార్మికులు సైతం ప్రయాణికులను ఆకట్టుకునేందుకు ట్రై చేస్తున్నారు. తాజాగా ఆర్టీసీ బస్ డ్రైవర్ ఏకంగా సింగర్ గా మారి పాట పాడుతూ ప్రయాణికులను ఆకట్టుకున్నారు.
నాగర్కర్నూల్ జిల్లా పెద్దకొత్తపల్లి మండల పరిధిలోని నాయినిపల్లి మైసమ్మ ఆలయంలో ప్రతి ఆదివారం జాతర జరుగుతుంది. మైసమ్మను దర్శించుకునేందుకు పలు ప్రాంతాల నుంచి భారీ సంఖ్యలో భక్తులు తరలివస్తారు. దీంతో నాగర్కర్నూల్, కొల్లాపూర్, వనపర్తి డిపోల నుంచి ఈ ఆలయానికి ప్రత్యేక బస్సు సర్వీసులను నడిపిస్తారు. ఈ క్రమంలో నాగర్కర్నూల్ డిపోకు చెందిన డ్రైవర్ శాంతయ్య.. మైసమ్మ జాతరకు వచ్చే ప్రయాణికులను ఆకర్షించేందుకు పాట పాడి మైమరిపించారు. మైసమ్మ దేవత ప్రాశస్త్యాన్ని వివరిస్తూ.. శాంతయ్య పాటను ఆలపించారు. ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం.. సురక్షితమంటూ ప్రయాణికులకు వివరించారు. అయితే.. డ్రైవర్ పాడిన పాట వీడియోను.. ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ తన ట్విటర్ ఖాతాలో షేర్ చేయగా.. అది వైరల్గా మారింది.