కేంద్రంపై 'పెట్రో' మంటలు...

కేంద్రంపై 'పెట్రో' మంటలు...

న్యూఢిల్లీ, మే 29:
ఐదు రాష్ట్రాల ఎన్నికల కోసం పెట్రోలు, డీజిల్ ధరలను పెరగకుండా చూశారు. అయితే ఎన్నికల ఫలితాలు వచ్చిన రోజు నుంచి పెట్రోలు ధరలు పెరుగుతూనే ఉన్నాయి. ఐదు రాష్ట్రాల ఎన్నికలకు ముందు కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ ఇక పెట్రోలు ధరలు పెరగవని ప్రజలకు హామీ ఇచ్చారు. అయినా ఫలితాలు వచ్చిన వెంటనే పెట్రోలు ధరలు పెరుగుతుండటం సామాన్య, మధ్య తరగతి కుటుంబాలకు భారంగా మారనుంది.ఏదైనా నాయకుడిపైనా, పార్టీపైనా విశ్వసనీయత ఉండాలి. మాట చెబితే దానికి కట్టుబడి ఉండాలి. కానీ మోదీ మాత్రం ఇందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. కేవలం రాజకీయాల కోసమే మోదీ జిమ్మిక్కులు చేస్తారన్నది మరోసారి స్పష్టమయింది. ఎన్నికల కోసమే పెట్రోలు ధరలను కొంతకాలం పెరగకుండా ఆపి, ఆ తర్వాత తిరిగి బాదుడు మొదలెట్టడంపై దేశవ్యాప్తంగా అసంతృప్తి తలెత్తుతోంది. తమదేమీ లేదని, చమురు కంపెనీలు నిర్ణయిస్తున్నాయని చెబుతున్నప్పటికీ ప్రజలు మోదీ ప్రభుత్వంపై ఆగ్రహంతో ఉన్నారు.ప్రస్తుతం దేశంలో పరిస్థితి అందరికీ తెలిసిందే. కరోనా వైరస్ రోజుకు మూడున్నర లక్షలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. ఇప్పటికే అనేక రాష్ట్రాలు లాక్ డౌన్ విధించాయి. దేశంలో దాదాపు పదహారు రాష్ట్రాలు లాక్ డౌన్ విధించాయి. మరికొన్ని రాష్ట్రాలు పాక్షిక లాక్ డౌన్ ను విధించాయి. ఈ నేపథ్యంలో సామాన్య, పేద, మధ్యతరగతి ప్రజల జీవనోపాధికి ఇబ్బందికరంగా మారింది. ఈసమయంలో మోదీ ప్రభుత్వం పెట్రోలు ధరలను పెంచడంపై సర్వత్రా నిరసన వ్యక్తమవుతుంది.పెట్రోలు ధరలు పెంచడంతో నిత్యావసర వస్తువుల ధరలు కూడా భగ్గుమంటున్నాయి. అసలే ఉపాధి లేక ప్రజలు అల్లాడి పోతుంటే నిత్యావసర వస్తువుల ధరలు పెరగడం మరింత ఆందోళనకు దారితీస్తుంది. మోదీ ప్రభుత్వం మాత్రం ఇవేమీ పట్టించుకోవడం లేదు. ప్రజల పట్ల కనీస సానుభూతి లేకుండా వ్యవహరిస్తుందన్న విమర్శలు విన్పిస్తున్నాయి. ఎన్నికల కోసమే ధరల తగ్గించడాన్ని ప్రజలు గమనించారు. ఇది భవిష్యత్ లో మోదీకి, ఆయన పార్టీకి ఇబ్బందులు తెలెత్తక తప్పవని అంటున్నారు.

What's Your Reaction?

like
0
dislike
0
love
0
funny
0
angry
0
sad
0
wow
0