కొడుకు మృతి.. అవయవ దానం చేసి గొప్ప మనసు చాటుకున్న తల్లిదండ్రులు

కొడుకు మృతి.. అవయవ దానం చేసి గొప్ప మనసు చాటుకున్న తల్లిదండ్రులు
నారాయణపేట జిల్లా : బ్రెయిన్డెడ్ అయి మరణించినా.. అవయవదానం చేసి పునర్జన్మ ఎత్తాడు ఓ యువకుడు. తమ కుమారుడు కన్నుమూశాడని పుట్టెడు దుఃఖంలో ఉన్న ఆ తల్లిదండ్రులు.. మరే ఇంట ఈ విషాదం జరగకూడదనుకుని అతని అవయవాలు దానం చేసేందుకు ముందుకొచ్చారు.దానాల్లోకెల్లా గొప్ప దానం అవయవదానం అని అంటుంటారు. ఎందుకంటే ఎవరైన చనిపోయాక వారి అవయవాలు దానం చేస్తే మరొకరి ప్రాణాలు కాపాడిన వాళ్లవుతారు. వాళ్లకి మళ్లీ పునర్జన్మను ఇచ్చిన వాళ్లవుతారు. అందుకోసమే కొంతమంది తాము చనిపోయిన అనంతరం తమ అవయవ దానం చేసేందుకు ముందుకు వస్తారు...ఇందుకు కోసం పలు ట్రస్టులతో ఒప్పందం కూడా చేసుకుంటారు. అలాగే మరికొందరు కూడా తమ కుటుంబీకుల్లో ఎవరైన మరణిస్తే అవయవ దానం చేస్తారు. ఇలాంటి ఘటనే తాజాగా చోటుచేసుకుంది. ఓ యువకుడు మరణించడంతో తన కుటుంబీకులు అతని ఆర్గాన్స్ దానం చేసి గొప్ప మనుసు చాటుకున్నారు. వివరాల్లోకి వెళ్తే.. నారాయణపేట జిల్లా కోటకొండ గ్రామానికి చెందిన రాహుల్ జడ్చర్ల పోలేపల్లి పారిశ్రామిక వాడలో ఉన్న ఓ మెడిసిన్ కంపెనీలో ఉద్యోగం నిర్వహిస్తున్నాడు.. అయితే గత ఐదు రోజుల క్రితం తన సొంత గ్రామం కోటకొండ నుంచి జడ్చర్లకు వెళుతూ కోటకొండ అటవీ ప్రాంతంలో ద్విచక్ర వాహనాన్ని అడవి పంది ఢీకొనడంతో తీవ్ర గాయాలు అయ్యాయి.. సమాచారం తెలుసుకున్న కుటుంబ సభ్యులు యువకున్ని హుటాహుటిన హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు.. చికిత్స పొందుతూ రాహుల్ బ్రెయిన్ డెడ్ కావడంతో అతని కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు.. అయినప్పటికీ తమ కుమారుడి మరణం.. మరో నాలుగు కుటుంబాల్లో వెలుగు నింపాలని.. అవయవ దానం చేయాలని నిర్ణయించుకున్నారు.. తమ కుమారుడి అవయవాలను దానం చేసి టైలర్ గణేష్ దంపతులు పలువురికి ఆదర్శంగా నిలిచారు...
ఆసుపత్రి సిబ్బంది తుది లాంఛనాలు పూర్తి చేసి యువకుని మృతదేహాన్ని వారికి అప్పగించారు.
What's Your Reaction?






